ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్ డీటీసీ అరెస్టు
- 10 గంటలకుపైగా విచారించిన ఏసీబీ..
- వరంగల్, జగిత్యాల, హైదరాబాద్లో ఏకకాలంలో సోదాలు
- రూ. కోట్లల్లో అక్రమాస్తులు గుర్తింపు
- విలువైన పత్రాలు, దస్తావేజులు స్వాధీనం
- రవాణాశాఖలో కలకలం
అక్షరదర్బార్, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని గుర్తించారు. ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిర, చరాస్తులకు సంబంధించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ స్వస్థలమైన జగిత్యాలతోపాటు హైదరాబాద్లోని ఆయన నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సుమారు 10 గంటలకుపైగా ఆయన్ను విచారించారు. అనంతరం హసన్పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తీసుకుని వచ్చి పలు అంశాలపై సమాచారాన్ని సేకరించారు. అనంతరం తిరిగి ఆయన్ను ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి.
కోట్లల్లో అక్రమాస్తుల గుర్తింపు
జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ రూ. కోట్లల్లో అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఇందులో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 15 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా బంగారు, వెండి ఆభరణాలు లభ్యమైనట్లు సమాచారం. ఈమేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి పుప్పాల శ్రీనివాస్ను అరెస్టు చేయడం కలకలంరేపుతోంది. గతేడాది ఫిబ్రవరిలో ఉమ్మడి వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అంతకుముందు హైదరాబాద్ రవాణాశాఖ కార్యాలయంలోపనిచేశారు.