తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ సస్పెన్షన్
అక్షరదర్బార్, హైదరాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై మల్లన్నను కమిటీ వివరణ కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని మల్లన్నకు కమిటీ గడువు ఇచ్చింది. వివరణ ఇవ్వకపోవడంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న ఇటీవల కాంగ్రెస్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మల్లన్న కొంతకాలంగా వాయిస్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కులగణన నివేదికను బహిరంగంగా చించివేశారు. అలాగే ఇతర కులాలపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.